విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా జిల్లా : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన సతీమణి వైఎస్ భారతికి సంబంధం లేకపోతే వారి కాల్డేటా బయటపెట్టాలని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. దీనికోసం సీబీఐని కోరాలన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు.. అర్ధరాత్రి 3.00 గంటల సమయంలో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతికి ఫోన్ చేసి ఏం మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో వివేకా హత్య కేసులో సాక్షాధారాలు ధ్వంసం చేశారన్నారు. ఇది వాస్తవం కాదా? అని చినరాజప్ప నిలదీశారు. సాక్షాధారాలు ధ్వంసం చేయడం ద్వారానే వివేకా హత్యలో వైఎస్ అవినాష్రెడ్డి పాత్ర ఉందని అర్థమవుతోందని, వివేకానందరెడ్డి గొడ్డలిపోటు వల్ల మరణిస్తే.. గుండెపోటు అని వైఎస్ జగన్ సొంత ఛానల్లో ఎందుకు వేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు
శివశంకర్రెడ్డిని వైసీపీ నుంచి బహిష్కరించలేదని, సీఎం జగన్ అండ లేకుండా సీబీఐ అధికారులపై అక్రమ కేసులు పెట్టడం సాధ్యమవుతుందా? అని నిలదీశారు. కడప ఎంపీ టికెట్ కోసమే ఈ హత్య జరిగిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల సీబీఐకి చెప్పలేదా? అని చినరాజప్ప ప్రశ్నించారు. వివేకా హత్యకేసుపై టీడీపీ పుస్తకాన్ని విడుదల చేసింది. 'జగనాసుర రక్త చరిత్ర బహిరంగం' పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
పాల్గున్న టీడీపీ రాష్ట్ర నాయకులు.. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పంచుమర్తి అనురాధ, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీన్ని విడుదల చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో సీఎం జగన్ లక్ష్యంగా చేసుకొని టీడీపీ నేతలు ఫైరవుతున్నారు.
Admin
Viswas Tv